భీమ్ న్యూస్ ప్రతినిధి న్యూఢిల్లీ – జాతీయం (నవంబర్ 26) దేశవ్యాప్తంగా ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బ్యాలెట్ పేపర్ విధానం కుదరదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బ్యాలెట్ పేపర్తో ఓటింగ్ చేపట్టాలని కోరుతూ కేఏ పాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్నాథ్ , జస్టిస్ పీబీ వరాలే లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పార్టీలకు ఈవీఎం తో సమస్య లేదు, మీ వద్ద ఎందుకు ఉంది? మీకు అలాంటి బ్రిలియంట్ ఆలోచనలు ఎక్కడ నుంచి వస్తాయి? అని పిటిషనర్ని ప్రశ్నించింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని పలువురు నేతలు అంటున్నారని, గెలిచినప్పుడు ఏమీ మాట్లాడటం లేదని తెలిపింది. కాబట్టి ఈ అంశాన్ని ఎలా చూడగలమని పేర్కొంది. ఈ పిటిషన్ను తిరస్కరిస్తున్నామని, వీటన్నింటిపై చర్చకు ఇది వేదిక కాదని స్పష్టం చేసింది.
3 లక్షలకు పైగా అనాథలు, 40 లక్షల మంది వితంతువులను రక్షించిన సంస్థకు పిటిషనర్ అధ్యక్షుడు( కేఏ పాల్) అని గ్రహించిన న్యాయస్థానం.. మీ పని చాలా భిన్నంగా ఉందని, ఈ రాజకీయ రంగంలోకి ఎందుకు వస్తున్నారు? అని ప్రశ్నించింది. అంతకుముందు కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ.. ఈవీఎంలను సులభంగా ట్యాంపర్ చేయొచ్చని, కాబట్టి ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లను ఉపయోగించే అమెరికా వంటి దేశాల పద్ధతులను భారత్ అనుసరించాలని సూచించారు. ఈవీఎంలు ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని, ఎలన్ మస్క్ వంటి ప్రముఖులు కూడా ఈవీఎం ట్యాంపరింగ్పై ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు.
ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి వంటి నేతలు కూడా ఈవీఎంలపై ప్రశ్నలు సంధించారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ను తిరస్కరించి పై వ్యాఖ్యలు చేసింది.కానీ కొన్ని అంశాల పట్ల సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని పలువురు విశ్లేషకులతో పాటు రాజకీయవేత్తలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలలో ఎవరైనా పాల్గొనవచ్చునే రాజకీయ హక్కును ప్రశ్నార్ధకం చేస్తున్నారని అంటున్నారు. ఈమధ్య ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఇదే అంశాన్ని, రాజ్యాంగానికి వ్యతిరేక తీర్పును ప్రకటించడం జరిగిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఫాన్స్ ,జపాన్, రష్యా , స్పెయిన్, ఇజ్రాయిల్ , ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బ్యాలెట్ పేపర్లను ఓటింగ్కు ఉపయోగిస్తుంటే అభివృద్ధి చెందుతున్న దేశంలో ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్) ఉపయోగించడం ఏమిటి ? అనే ప్రశ్నకు సమాధానం ఎక్కడా దొరకడం లేదని తెలుస్తోంది. ఏ వ్యక్తి అయినా రాజ్యాంగం ప్రకారం రాజకీయాల్లో పాల్గొనే హక్కు ఉండగా మీకు రాజకీయాలతో పని ఏమిటి ? అనే ప్రశ్న సుప్రీంకోర్టు అడగడం ఎంతవరకు సమంజసం అని రాజకీయ విశ్లేషకులు ఈ తీర్పు పట్ల తీవ్రంగా విభేదిస్తున్నారు. ఏది ఏమైనా రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులు వెలువరిస్తూ ఉండడం దేశవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారిందని భావిస్తున్నారు.
Leave a Reply