భీమ్ న్యూస్ ప్రతినిధి మంచిర్యాల -తెలంగాణ (డిసెంబర్ 04) విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. వికృత చేష్టలకు పాల్పడగా అతడికి విద్యార్థుల తల్లితండ్రులు దేహశుద్ధి చేశారు.విచారణ చేసిన అనంతరం విద్యాశాఖ అధికారులు అతడిని సస్పెండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో మంగళవారం వెలుగుచూసిన ఈ ఘటనపై డీఈవో యాదయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తాడోజు సత్యనారాయణ తెలుగు ఉపాధ్యాయుడి (ఎస్ఏ)గా పనిచేస్తున్నాడు. ఈయన ఓ ఉపాధ్యాయ సంఘానికి జిల్లా నాయకుడు కూడా. ఇటీవల పదోన్నతుల్లో భాగంగా బాలికల పాఠశాలలో విధుల్లో చేరాడు.
సెల్ఫోన్తో తరగతి గదిలో విద్యార్థినులను అసభ్యకరంగా వీడియోలు, ఫొటోలు తీస్తూ.. వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఓ బాలిక ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు.. మిగతా బాలికలను కూడా ఆరా తీసి నిర్ధారించుకున్నారు. అనంతరం పలువురు తల్లిదండ్రులు సోమవారం సాయంత్రం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి ద్వారా ఎంఈవో, డీఈవోల దృష్టికి తీసుకెళ్లారు. డీఈవో కార్యాలయ అధికారులు మంగళవారం పాఠశాలకు వచ్చి విచారణ చేయగా.. ఉపాధ్యాయుడు తమను ఇబ్బంది పెడుతున్న తీరును బాలికలు ఏకరువు పెట్టారు. విచారణ జరుగుతోందని తెలుసుకున్న ఉపాధ్యాయుడు సత్యనారాయణ పాఠశాల గోడదూకి పారిపోగా.. విద్యార్థుల తల్లిదండ్రులు వెంబడించి పట్టుకుని చెప్పులతో దేహశుద్ధి చేశారు. విచారణ అనంతరం అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చినట్లు డీఈవో తెలిపారు.
Leave a Reply