భీమ్ న్యూస్ ప్రతినిధి మర్రిపాడు (డిసెంబర్ 18) తాజాగా దేశాన్ని జికా వైరస్ వణికిస్తోంది. మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ కలకలం సృష్టిస్తుంది. ఎక్కడో ఉగాండాలో పుట్టిన ఈ వైరస్ దేశాలు దాటి ఏకంగా ఇండియా చేరుకుంది. ఈ ఏడాది జూలైలో దేశాన్ని భయపెట్టిన ఈ జికా మహమ్మారి ఇప్పుడు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలోని ఓ బాలుడికి జికా వైరస్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ బాలుడిని వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే బాలుడికి జికా వైరస్ సోకిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ప్రచారంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. బాలుడికి జికా వైరస్ సోకిందా లేదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పుకొచ్చారు. అయితే గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం :
నెల్లూరు జిల్లాలో ఓ బాలుడికి జికా వైరస్ సోకిందంటూ వస్తున్న వార్తలపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. ‘అనారోగ్యానికి గురైన బాలుడికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నాం. కార్పొరేట్ వైద్యం కోసం చెన్నై తరలించాం. వ్యాధి నిర్ధరణకు బ్లడ్ శాంపిల్స్ను అధికారులు పుణే ల్యాబ్కు పంపించారు. వెంకటాపురం గ్రామానికి ప్రత్యేక వైద్య బృందాలు వెళ్లాయి. బాలుడి కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్థులకు వైద్యపరీక్షలు చేస్తున్నారు’ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. మరోవైపు వైద్య సిబ్బందిని సైతం అలర్ట్ చేసినట్లు వెల్లడించారు. గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇంకెవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నాయేమోనని పరీక్షలు నిర్వహిస్తున్నారు.
చెన్నలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలుడికి చికిత్స :
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని ఓ గ్రామంలో ఏడేళ్ల బాలుడికి ఇటీవలే ఫిట్స్ వచ్చాయి. దీంతో భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఏదో వైరస్ సోకిందని తక్షణమే చెన్నైకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బాలుడుని కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిక తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాలుడికి జికా వైరస్ సోకినట్లు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. జికా వైరస్ సోకిందనే అనుమానం ఉన్న బాలుడిని ఇప్పటికే చెన్నైకి తరలించారని అక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం పర్యటించి గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు అని మంత్రి పడాల్సిన అవసరం లేదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.
ఉగాండాలో జికా మొదటి కేసు :
ఇకపోతే జికా వైరస్ సోకిన ఆడ ఎడెస్ దోమ కాటు కారణంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు బాధితునిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ ను తొలిసారిగా ఉగాండాలో 1947లో కనుగొన్నారు. అడవుల్లోని ఓ కోతిలో ఈ వైరస్ను గుర్తించారు. ఆ తర్వాత ఈ వైరస్ మనుషులకు సైతం సోకింది. ఈ వైరస్ ఆఫ్రికన్ దేశాలతో సహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఈ జికా వైరస్ కేసులో పూణెలో నమోదు కావటం ఆందోళనకు గురిచేస్తోంది.
జికా వైరస్ లక్షణాలు :
చర్మం పై దద్దుర్లు,
ఫీవర్
చలి
కీళ్ల నొప్పులు
కండ్లకలక
కండరాల నొప్పులు
తలనొప్పి
అలసట
ఆకలి లేకపోవడం,
జీర్ణ కోశ సంబంధ సమస్యలు,
గొంతు నొప్పి
దగ్గు వంటి లక్షణాలు
జికా వైరస్ నిర్ధారణ:
జికా వైరస్ లక్షణాలు కలిగి ఉన్నట్లు అనుమానాలు వస్తే వారం లోపు జికా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. జికా ఇన్ఫెక్షన్ని గుర్తించడానికి రక్తం, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. గర్భిణీ జికా సోకిన తల్లులకు అల్ట్రాసౌండ్లు (ప్రతి 3 నుండి 4 వారాలకు) సిఫార్సు చేయబడతాయి. అల్ట్రాసౌండ్ పరీక్ష పిండంలో మైక్రోసెఫాలీ మరియు ఇంట్రాక్రానియల్ కాల్సిఫికేషన్లతో సహా అనేక పిండం మెదడు రుగ్మతలను గుర్తించవచ్చు. అలాగే అమ్నియోసెంటసిస్ పరీక్షలు నిర్వహిస్తారు. పుట్టబోయే బిడ్డలో జికా వైరస్ సంక్రమణ సంకేతాల కోసం ఉమ్మనీరును పరీక్షిస్తారు.
జికా వైరస్కు చికిత్స :
జికా వైరస్ వ్యాధికి నిర్దిష్ట మందులు గానీ టీకాలు లేవు. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అలసట మరియు జ్వరం కలిగిస్తుంది. వైద్యుడు సూచించినట్లు పారాసెటమాల్ టాబ్లెట్స్ వాడాలి. జికా వైరస్ ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాల్లో ఉంటున్న గర్భిణీ స్త్రీలు దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల నివారణ మందులను, బెడ్ నెట్లు ఉపయోగించాలి. నీరు, పండ్ల రసాలు, మజ్జిగ మరియు కొబ్బరి నీరు వంటి తగినంత ద్రవాలను త్రాగాలని వైద్యులు తెలిపారు.
Leave a Reply