భీమ్ న్యూస్ ప్రతినిధి ఒంటిమిట్ట (జనవరి 11) కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన భక్తులు వేకువ జాముననే శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్ల దర్శనం చేసుకున్నారు. తొలుత ఆలయ టీటీడీ పర్యవేక్షకులు రామాలయాన్ని మామిడి తోరణాలతో, అరటి పిలకలతో, వివిధ రకాల పుష్పాలతో రంగవల్లికలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు.
ఆలయానికి వస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా ఆలయ తూర్పు భాగం నుంచి ఉత్తరభాగ గాలిగోపుర దర్శన మార్గం గుండా ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా టిటిడి నిర్వహకులు పూర్తి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడం చేత పలు ప్రాంతాలకు చెందిన భక్తులు చలి, మంచును తట్టుకొని శ్రీరామ స్మరణలతో వేకువ జామున నుంచి క్యూ లైన్ ల మార్గం గుండా ఉత్తర గాలి గోపురం వద్దకు ప్రవేశిస్తూ ధనుర్బాణాలంకరణ వేషధారియై సతి సోదర సమేతంగా శ్రీ కోదండ రామస్వామి గురుత్వంత వాహనంపై కొలువుతీరి ఉండగా ఆ మంగళమూర్తిని దర్శించుకుని ఆలయంలోకి వెళ్లి తీర్థప్రసాదాలను స్వీకరించి శ్రీరామ భజనలు చేస్తూ మంత్రముగ్ధులయ్యారు.
ఉభయదాతలు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఒంటిమిట్ట ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది ఆలయం వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. టీటీడీ పర్యవేక్షకులు గ్రామ పురవీధుల్లో స్వామివారి గ్రామోత్సవం అత్యంత ఆడంబరంగా కోలాహలంగా నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో పుర ప్రజలు స్వామివారికి యధాశక్తిగా టెంకాయ, కర్పూరం నొసంగి ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబు, సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ నేతృత్వంలో స్థానిక, అదనపు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా భక్తుల వాహనాలను నిలుపుదల చేయుటకు ఒక క్రమబద్ధంగా ప్రత్యేక వాహన పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఏది ఏమైనప్పటికీ వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ఒంటిమిట్ట క్షేత్రము భక్తులతో కిటకిటలాడిందని చెప్పాలి.
Leave a Reply