భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుమల (జనవరి 15) తిరుమలలో మరో ఘోరం జరిగింది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్లో ఉన్న యాత్రికుల వసతిగృహ సముదాయం రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ పడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. కడప చిన్నచౌక్ ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు కృష్ణవేణి దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి శ్రీవారి దర్శనార్థం జనవరి 13న తిరుపతికి చేరుకున్నారు. ఈనెల 14న స్వామివారి దర్శనానికి సంబంధించిన టోకెన్లను తిరుపతిలో ఈనెల 16వ తేదీకి కేటాయించారు. బుధవారం ఉదయం తిరుమల చేరుకున్న ఆ కుటుంబం.. పద్మనాభ నిలయంలో లాకర్ పొందారు. అనంతరం వరాహస్వామిని దర్శించుకుని తిరిగి మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పద్మనాభ నిలయానికి చేరుకున్నారు.
అయితే సాయంత్రం 5 గంటలకు అన్నతో కలిసి సరదాగా ఆడుకుంటున్న చిన్నారి సాత్విక్ శ్రీనివాసరాజు ప్రమాదవశాత్తూ రెండో అంతస్తు పైనుంచి పడిపోయాడు. అంత ఎత్తు నుంచి పడడంతో బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో తల్లిదండ్రులు గాయపడిన కుమారుడిని హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చికిత్స చేస్తుండగానే చిన్నారి సాత్విక్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో శ్రీనివాస్, కృష్ణవేణి దంపతులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇక తిరిగి రాడని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, జనవరి 8న రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రాణం పోవడంతో తిరుమల ప్రాంతంతో పాటు, స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Leave a Reply