భీమ్ న్యూస్ ప్రతినిధి రాయచోటి (ఫిబ్రవరి 01) ఏపీలో అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి మండలంలో ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఐటీ ఉద్యోగులతో ఆయన ముఖాముఖి నిర్వహించిన భేటీలో ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాను ఐటీ ఉద్యోగిని అని పరిచయం చేసుకుని తన జీతం ఎంతో చెప్పాడు. అది తెలుసుకుని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఆశ్చర్యపోయారు. వామ్మో.. అని నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఆ ఐటీ ఉద్యోగి జీతం ఎంతో తెలుసా.. ఏడాదికి 93 లక్షల రూపాయలట.
జీతం ఏడాదికి రూ.93 లక్షలు :
తన పేరు యువరాజ్ యాదవ్ అని ఆ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. బెంగళూరులో సాఫ్ట్ ఇంజినీర్ గా పని చేస్తున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లు తెలిపాడు. తనకు కటింగ్స్ పోగా నెలకు వచ్చే జీతం 6 లక్షల 37వేలు అని చెప్పాడు. తన ఓవరాల్ శాలరీ ఏడాదికి 93 లక్షల రూపాయలు అని చెప్పాడు. అంతే, అక్కడున్న వారంతా విస్తుపోయారు.
అతడి జీతం ఎంతో తెలిసి అవాక్కయిన సీఎం చంద్రబాబు :
అతడు ఆ మాట అన్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అవాక్కయ్యారు. ఎంత వస్తుంది మరోసారి చెప్పమ్మా అన్నారు. దానికి అతడు ఏడాదికి 93 లక్షలు అన్నాడు. ఇంటి దగ్గర కూర్చుని సంవత్సరానికి 93 లక్షలు సంపాదిస్తున్న యువరాజ్ కి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంతేకాదు.. ఐయామ్ ఫ్రౌడాఫ్ హిమ్ అని కూడా అన్నారాయన.
జీతంపై ట్రోల్స్.. స్పందించిన యువరాజ్ :
తాను ఓ కంపెనీకి జీఎం(జనరల్ మేనేజర్) హోదాలో పని చేస్తున్నట్లు తెలిపాడు. తనకు 14ఏళ్లకు పైగా అనుభవం ఉందన్నాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీటింగ్ లో తన జీతం గురించి తాను చెప్పింది అక్షరాల నిజం అన్నాడు. తన జీతం ఇంకా తక్కువే చెప్పానన్నాడు. కావాలంటే ప్రతి ఫ్రూప్ చూపిస్తానన్నాడు. అనవసరంగా తనను ట్రోల్ చేయవద్దన్నాడు. ఇలా చేయడం వల్ల తనకు, తన జాబ్ కు రిస్క్ కావొచ్చన్నాడు.తన కంపెనీ పేరు బయటకు చెప్పకూడదని యువరాజ్ వెల్లడించాడు. అంతేకాదు 30శాతం ట్యాక్స్ కడుతున్నట్లు వివరించాడు. ఎవరికైనా అనుమానం ఉంటే నా ఊరు వచ్చి చూసుకోండని చెప్పాడు. ప్రతి ఆధారం నేను వారికి చూపిస్తాను అని అన్నాడు. దీనికి సంబంధించి పలు డాక్యుమెంట్లు చూపిస్తూ యువరాజ్ ఓ వీడియోను సోషల్ మీడియలో పెట్టాడు.
Leave a Reply