భీమ్ న్యూస్ ప్రతినిధి నెల్లూరు (ఫిబ్రవరి 22) రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జెండాదిబ్బ వద్దనున్న బహుళ ప్రయోజన సౌకర్య గోదాము (స్టాక్ పాయింట్)ను శనివారం తనిఖీ చేశారు. ధాన్యం సేకరణకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. స్టాకు, సరఫరా మొదలైన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి లకు స్థానిక నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. గుర్రపు స్వారీలు, తీన్మార్ డప్పులతో సందడి చేశారు. బాణసంచా మోతలు, మంగళ వాయిద్యాలతో ఘనంగా ఆహ్వానించారు. తనిఖీ అనంతరం మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ఇది మహిళా పక్షపాత ప్రభుత్వమన్నారు. మహిళలందరూ కూడా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
వచ్చేనెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక టెక్నాలజీతో క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రేషన్ కార్డులను అందిస్తామని చెప్పారు. రేషన్కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇచ్చిన దీపం`2 పథకం హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారని, ఇందులో భాగంగా ఈ జిల్లాలో 4లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అహర్నిశలు శ్రమిస్తూ అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ కూడా మంచి పరిపాలన అందిస్తున్న ఎన్డిఎ కూటమి ప్రభుత్వానికి ఆశీస్సులు అందించాలని కోరారు.
అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ స్టాక్ పాయింట్ను మంత్రి నాదెండ్ల మనోహర్ క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారని, ఇలాంటి చిత్తశుద్ధి గల మంత్రి సివిల్ సప్లయిస్ మంత్రిగా వుండడం మనందరి అదృష్టంగా ఎంపీ చెప్పారు. జిల్లాలోని స్టాక్ పాయింట్ల అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తమై ఎటువంటి పొరపాట్లు లేకుండా ప్రజలకు తుకాల్లో తేడాలు లేకుండా నాణ్యమైన వస్తువులను అందించాలని సూచించారు. అన్ని వస్తువులు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండేలా చూసుకోవాలని సూచించారు. తనిఖీలతో ప్రజలకు నాణ్యమైన సరకులు అందించగలుగుతామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీసులతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్కుమార్, రాష్ట్ర వక్ప్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో పావని, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డిసివో గుర్రప్ప, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Leave a Reply